వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక మలుపు.. వైసీపీ నేత హస్తం, 11 మంది అరెస్ట్

  • రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు
  • మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాత్రపై పోలీసుల నిర్ధారణ
  • కేసును నీరుగార్చాలని చూసిన పోలీసు అధికారులపై వేటు
కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది గంజాయి ముఠా చేసిన హత్య కాదని, రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో వైసీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఉన్నారని పోలీసులు నిర్ధారించారు.

తొలుత ఈ కేసును గంజాయి గొడవగా చిత్రీకరించి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌకు సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డిలను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు.

రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలెత్తిన మనస్పర్థల కారణంగానే నిత్యానందరెడ్డి కోసం తాము ఈ హత్య చేసినట్లు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆలంఖాన్‌పల్లె జాతరలో జరిగిన చిన్న గొడవను కారణంగా చూపి, రిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న దస్తగిరిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.

ప్రస్తుతం నిత్యానందరెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన కడప రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
 

Kadapa
Dastagiri
Dastagiri murder case
Bandi Nityananda Reddy
Real estate dispute
YS Jagan Mohan Reddy
Andhra Pradesh crime
Ganja gang
Kadapa politics
Lookout notice

More Telugu News